డబ్బు ఇవ్వకపోతే చస్తారు

19 Mar, 2020 10:43 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

పెనకొండ టీడీపీ నాయకులకు బీకే పార్థసారథి అల్టిమేటం

స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో తీసుకున్న డబ్బు వెనక్కు చెల్లించాలన్న జెడ్పీటీసీ అభ్యర్థి

విశాలాక్షికి మద్దతుగా పార్టీ నాయకులతో సమావేశమైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు 

పెనుకొండ: తీసుకున్న డబ్బు వాపస్‌ చేయకపోతే చస్తారంటూ పెనుకొండ నియోజవకర్గం టీడీపీ నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రొద్దం జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ నుంచి గాండ్ల విశాలాక్షి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలో నిలిచిన నియోజకవర్గంలోని  ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చులకు తన సొంత డబ్బు రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమైన ఆమె ఆ మొత్తాన్ని పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథికి అందజేసినట్లు సమాచారం.

అయితే ఎన్నికలు వాయిదా పడడంతో తాను ఇచ్చిన డబ్బు వాపసు చేయాలంటూ బీకేపై ఆమె ఒత్తిడి చేశారని తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులను బుధవారం రొద్దంకు రప్పించుకుని బీకే సమావేశమయ్యారు. తాను ఇచ్చిన డబ్బు వెంటనే వాపసు చేయాలని లేకపోతే చస్తారంటూ హుకుం జారీ చేయడంతో నాయకులు బిత్తరపోయారు. ఎన్నికలు సకాలంలో జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ డబ్బు తాము ఖర్చు చేశామని, ఇప్పటికిప్పుడు వాపసు చేయాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదంటూ పలువురు వాపోతున్నారు. అయినా పార్టీ అధ్యక్షుడు ససేమిరా అంటూ గడువు విధించి, ఆ లోపు డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేసినట్లు చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు