బీజేపీ ఎంపీ అర్వింద్‌తో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భేటీ

12 Sep, 2019 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి ప్రకంపనలు ఇంకా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ గురువారం నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాగా మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేదని షకీల్‌ అసంతృప్తిగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ...అర్వింద్‌తో సమావేశం కావడంతో టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. భేటీ అనంతరం షకీల్‌ పార్టీ మారడంపై స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ ఫీలర్లు వదిలారు.  ఇక మంత్రివర్గంలో స్థానం దక్కని జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డిని టీఆర్‌ఎస్‌ అధిష్టానం బుజ్జగించడంతో వారిద్దరూ మెత్తపడ్డారు. నాయిని బహిరంగంగానే తన అసంతృప్తి తెలిపితే, జోగు రామన్న మాత్రం అలక వహించి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే బీజేపీ పలుమార్లు... టీఆర్‌ఎస్‌ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని సోషల్‌ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు సందర్భంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్న ఆ పార్టీ స్థానిక నేతలపై దృష్టి సారించింది. 

మరిన్ని వార్తలు