కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నాం
హైదరాబాద్లో కూర్చొని అనవసర ఆరోపణలు చేయడం తగదు: మంత్రి బొత్స
సాక్షి,అమరావతి: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రచారం చేసుకునే వ్యక్తి కాదని చెప్పారు. తమ ప్రభుత్వానికి పబ్లిసిటీ అవసరం లేదని, పని చేసుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
► 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని సీఎంకు లేఖ రాశారు.. ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వంపై బురదజల్లాలనుకోవడం దురదృష్టకరం.
► ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నాం.
► ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలి.
► వలంటీర్ల ద్వారా ఇంటింటినీ జల్లెడపట్టి సర్వే చేయిస్తున్నాం.
► వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
► 15 రోజుల వరకు రేషన్ ఇస్తారు.. తొందరపడి ఎవరూ గుంపులు గుంపులుగా రావొద్దు. ఒక రేషన్ డీలర్ మూడు ప్రాంతాల్లో సరుకులు ఇచ్చేట్టుగా చూడాలి.
► వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందజేస్తున్నాం. ఎవరైనా వేరొక ఊరిలో ఉండిపోతే అక్క డ కూడా రేషన్ తీసుకోవచ్చు. పెన్షన్ లబ్ధిదారులు వేరే ఊర్లలో ఉండిపోతే పెన్షన్ తాలూకు సమాచారం వలంటీర్లకు తెలిపి డబ్బులు తీసుకోవచ్చు.