అగ్రిగోల్డ్‌ కాదు.. బాబు గోల్డ్ : బొత్స

13 Apr, 2018 16:33 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌ బాధితులకు చం‍ద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ది 4వేల కోట్ల రూపాయల కుంభకోణం అని.. వేల కోట్లు కాజేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అగ్రిగోల్డ్‌ని బాబు గోల్డ్‌గా మార్చారంటూ ఏద్దేవా చేశారు. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని బొత్స డిమాండ్‌ చేశారు. గురువారం వైఎస్సార్‌ సీపీపై విమర్శలు చేసిన కుటుంబరావుకు అగ్రిగోల్డ్‌తో ఏం సంబంధం ఏంటని, ఆయన ప్రాణాళికా సంఘం ఉపాధ్యక్షుడా.. లేక తెలుగుదేశం అధికార ప్రతినిధా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి అడుగడుగునా వారిని మోసం చేశారని మండిపడ్డారు. 1100 కోట్ల రూపాయలను విడుదల చేసి 16 లక్షల కుటుంబాలను ఆదుకోలేరా అంటూ ప్రశ్నించారు. 

ఇప్పటి వరకూ 20 లక్షల కుటుంబాల్లో 200 కుటుంబాల పెద్దలు ప్రాణాలు కోల్పోయారని, బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అందులోనే దోచుకోవాలని చూస్తోందంటూ బొత్స మండిపడ్డారు. కేసు కోర్టులో ఉండగా ఈనెల 3న అమర్ సింగ్, సుభాష్ చంద్రలను సీఎం చంద్రబాబు ఎందుకు అర్ధరాత్రి కలిశారని ప్రశ్నించారు. 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తే  80% బాధితులకు ఊరట లభిస్తుందని చెప్పారు. బాధితుల మీద సానుభూతి ఉంటే, న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఉంటే 1300 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పుష్కరాలకు కోట్లు ఖర్చు చేసిన బాబు, 20 లక్షల బాధిత కుటుంబాల్లో 18 లక్షల కుటుంబాలకు న్యాయం చేసేందుకు 1300 కోట్లు కేటేయిస్తే తప్పేముందని నిలదీశారు. బాధితులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు మాట మార్చారని ఆయన విమర్శించారు. 

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన కంటే, ఆస్తులు కోట్టేయలన్న ఆలోచనే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోందని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుందన్నారు. సింగపూర్‌కు చంద్రబాబు ఎందుకు వెళ్లారో త్వరలోనే బయటపెడతామన్నారు. 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుంటే మీరు ఆస్తులు కూడగట్టాలని చూస్తారా? అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం మీద సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొరికినంత దోచుకోవటమే అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ముగ్గురు మంత్రులతో పాటు మరో 70 మంది అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారని.. వాటితో పాటు చంద్రబాబు ఢిల్లీ రహస్య మంతనాలపై విచారణ జరపాలన్నారు. చంద్రబాబు లాలూచీ లేకుంటే, తెలుగుదేశం నేతలు బెదిరింకుంటే ఎస్సేల్ సంస్థ ఎందుకు తప్పుకుంటుందని బొత్స ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు