అగ్రిగోల్డ్‌ ఖాతాదారులను సీఎం ముంచారు: బొత్స

17 Nov, 2018 12:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అగ్రిగోల్డ్‌ ఖాతాదారులను సీఎం చంద్రబాబు నాయుడు నిలువునా ముంచారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారయణ మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో ముఖ్యమైన హాయ్‌లాండ్‌ను చంద్రబాబు, లోకేష్‌లు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16 లక్షల అగ్రిగోల్డ్‌ కుటుంబాలను వీధిపాలు చేశారని ధ్వజమెత్తారు. హాయ్‌లాండ్‌ ఆస్తులు తమవంటు మరొకరు రావడం విడ్డూరంగా ఉందని, కోర్టు కళ్లుగప్పి మోసం చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు.

చంద్రబాబు అండ్‌ టీమ్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచేశారని, పట్టపగలే గజదొంగల్లా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. విశాఖలో కూడా భూ దోపిడీ జరిగిందని, ఇటు ప్రజాధనం, అటు ప్రైవేట్‌ ఆస్తులను దోచేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు జరుగుతుందనే భయం చంద్రబాబు సర్కార్‌కు పట్టుకుందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు