రిపబ్లిక్‌ డే : కొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు

26 Jan, 2020 13:43 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు బాహాబాహీకి దిగారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఇండోర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో 71వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ పతాకం ఆవిష్కరణకు హాజరైన కాంగ్రెస్‌ నేతలు.. దేవేంద్రసింగ్‌ యాదవ్‌, చందు కుంజీర్‌లు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇతర నాయకులు, కార్యకర్తలు చూస్తుండగానే ఘర్షణకు దిగారు. పార్టీ నేతలు వారించినా కూడా వినిపించుకోలేదు.  చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురు నేతలను అక్కడి నుంచి కొద్ది దూరం తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

అయితే వారిద్దరు ఏ అంశంపై ఘర్షణకు దిగారనే దానిపై స్పష్టత లేదు. కాగా, 15 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అధికార పంపిణీకి సంబంధించి మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు