వారిలో స్వామీజీలు కూడా ఉన్నారు: బృందా కారత్‌

8 Nov, 2019 12:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోయేలా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. శుక్రవారమిక్కడ ఆమె మాట్లాడుతూ... నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బ పడిందన్నారు. గత 60 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని విమర్శించారు.

‘గ్రామీణ భారత దేశం పనులకోసం ఎదురు చూస్తుంది.  బీజేపీ హయాంలో భారతదేశం నేర దేశంగా ఎదుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత రెండేళ్లలో మహిళలపై దాదాపు 38000 అకృత్యాలు జరిగాయి. నేను జాతీయ నేర గణాంక లెక్కల ప్రకారమే ఈ వివరాలు చెబతున్నా. కొన్ని రాష్ట్రాలలో ఏకంగా ఎమ్మెల్యేలపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంత మంది స్వామీజీలు కూడా ఉన్నారు’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.

మోదీ సర్కారు తలాక్‌ బిల్లుపై చూపిన శ్రద్ధ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఎందుకు చూపడం లేదని బృందాకారత్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు అధికార పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు సీపీఎం ఆధ్వర్యంలో మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు బృందాకారత్‌ తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు