సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!

26 Jul, 2019 10:38 IST|Sakshi

సాయంత్రం 6గంటలకు యడ్యూరప్ప ప్రమాణం

సాక్షి, బెంగళూరు: అనేక ఉత్కంఠ పరిణమాల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ దానికి సానుకూలంగా స్పందించారని, ఆరోజు సాయంత్రం 6గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేస్తారని సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎంగా తాను ప్రమాణం చేస్తానని యడ్డీ స్పష్టం చేశారు. 

ఇదిలావుండగా కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్‌ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఆచితూచి అడుగులు వేస్తోన్న బీజేపీ కేంద్రనాయకత్వం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవల్సిందిగా యడ్డీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన రెబల్స్‌పై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది.  

మరిన్ని వార్తలు