మరికొన్ని గంటల్లో తుది జాబితా: యడియూరప్ప

19 Aug, 2019 15:30 IST|Sakshi

బెంగళూరు: అనుకున్న విధంగానే మంగళవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని.. మరో 2-3 గంటల్లో అమిత్‌ షా నుంచి మంత్రుల తుది జాబితా తనకు అందుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. మూడు వారాల క్రితం కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ కూటమి కూలిన తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని శాఖల్ని ఆయన తన వద్దే ఉంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు గడుస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పట్ల విపక్షాలు విమర్శలు కురుపిస్తోన్నాయి.

ఈ నేపథ్యంలో యడియూరప్ప సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మరికొన్ని గంటల్లో అమిత్‌ షా నుంచి మంత్రుల తుది జాబితా అందుతుంది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం 10.30 నుంచి 11.30గంటల మధ్య ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్‌కి తెలియజేశాను. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను’ అని మీడియాకు వెల్లడించారు. 13 నుంచి 14 మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు