పవన్ కల్యాణ్ కమిటీ కొత్తగా నిర్ధారించిందేమీ లేదు
మోదీ, చంద్రబాబు హామీల అమలు పూచీ నీదేనన్నావ్ కదా!
ఆ లెక్కన ప్రత్యేక హోదా రాకపోవడంలో నీకూ భాగస్వామ్యముంది
ఇప్పటికైనా కనువిప్పు అయ్యిందని ఒప్పుకో
జనసేన అధినేతకు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతూ వస్తోందో.. అవే అంశాలు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్సీ) నివేదికలో కూడా ఉన్నాయని, వాళ్లు కొత్తగా చెప్పిందేమీ లేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పద్మనాభయ్య, ఉండవల్లి అరుణ్కుమార్, జేపీ, ఐవైఆర్ కృష్ణారావు సభ్యులుగా ఉన్న జేఎఫ్సీ రూపొందించిన నివేదికలో.. ప్రత్యేక హోదా మన హక్కు అని, అది వచ్చి తీరాల్సిందేనంటూ పేర్కొన్నారని.. పవన్ కూడా ఈ విషయం ప్రకటించారని గుర్తు చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ మొదటి నుంచీ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ‘కేంద్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుంది? అని వైఎస్సార్సీపీ ఎప్పటినుంచో ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని జేఎఫ్సీ కూడా చెప్పింది’ అని ఆయన వివరించారు. విభజన చట్టం ప్రకారం విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం ఓడరేవు, కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితరాలు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయని తాము చెబుతున్నామని.. అదే విషయం కమిటీ చెప్పిందన్నారు. వీటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
‘అవిశ్వాసం’పై కట్టుబడి ఉండు..
తొలి నుంచీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఏదైతే చెబుతున్నారో అవే అంశాలను జేఎఫ్సీ ఇవాళ నిర్ధారించినందున.. పవన్ కల్యాణ్ ప్రతిపక్షాన్ని అభినందించి, మద్దతుగా నిలవాలని బుగ్గన సూచించారు. అలాగే తనకు ఇప్పుడు కనువిప్పు అయ్యిందని.. ప్రతిపక్షం చెప్పేది సరైనదేనని కూడా పవన్ చెప్పాల్సిన అవసరముందన్నారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి ప్రాధాన్యం లేదని పవన్కల్యాణ్ చెప్పడాన్ని బుగ్గన తోసిపుచ్చారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి ముందుకు వస్తే మద్దతు కూడగడతానని పవన్ చెప్పారని, ఆ మాటకు ఆయన కట్టుబడి ఉండాలని హితవు పలికారు.
చంద్రబాబు అసమర్థతేంటో కూడా చెప్పు..
గత ఎన్నికల్లో నరేంద్రమోదీ, చంద్రబాబు ఇచ్చే హామీల అమలుకు పూచీ తనదేనని పవన్కల్యాణ్ ప్రకటించిన విషయాన్ని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ లెక్కన రాష్ట్రానికి హోదా సాధించ లేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పవన్కూ భాగస్వామ్యం ఉందన్నారు. ఇప్పటికీ బీజేపీ–టీడీపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్.. ప్రస్తుతం ఆ పాత్ర నుంచి క్రమంగా జడ్జిమెంట్ ఇచ్చే స్థాయికి రూపాంతరం చెందుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అసలు తప్పెవరిదో.. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించలేక పోయిందెవరో? కచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత జడ్జిమెంట్ ఇచ్చే వారిపైనే ఉందని సూచించారు. అదేమీ చెప్పకుండా మొత్తం బాధ్యత కేంద్రానిదే అన్నట్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని విస్మరించడం సరికాదని హితవు పలికారు. కేంద్రంలో టీడీపీ మంత్రులున్నారని.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు, హోదా సాధించుకోవాల్సిన బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోందని చెప్పారు. ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు.. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోగలుగుతామన్నారు. అలా కానప్పుడు ఇక ప్రాంతీయ పార్టీ అనేది అనవసరమని.. జాతీయ పార్టీలో విలీనం చేసుకోవచ్చని టీడీపీకి బుగ్గన సూచించారు.