భయపడుతున్న టీడీపీ నేతలు: బుగ్గన

21 Nov, 2017 16:05 IST|Sakshi

సాక్షి, బేతంచర్ల: రామరాజ్యం, రాజన్న రాజ్యం తీసుకురావడమే వైఎస్‌ జగన్‌ లక్ష్యమని వైఎస్సార్‌ సీపీ నాయకుడు, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం కర్నూలు జిల్లా బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌లో సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టడం చూసి టీడీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ సర్కారు విఫలమైందని విమర్శించారు. డోన్‌లో మైనింగ్‌ కాలేజీ పెడతామని మాట తప్పారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. ప్రతి ఒకరు తల ఎత్తుకుని తిరిగేలా రాజన్న రాజ్యం తెస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

జనంతో పోటెత్తిన బేతంచర్ల..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇక్కడికి చేరుకున్న రాజన్న తనయుడిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌ పోటెత్తింది. రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనమే కనిపించారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది.

>
మరిన్ని వార్తలు