4 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు.. నేడు ఉప ఎన్నికలు

28 May, 2018 03:06 IST|Sakshi

న్యూఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానా లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అలాగే నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌), షాకోట్‌(పంజాబ్‌), జోకిహట్‌(బిహార్‌), గొమియా, సిల్లీ(జార్ఖండ్‌), చెంగన్నూరు(కేరళ), పాలుస్‌ కడేగావ్‌(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్‌) మహేస్థల( పశ్చిమబెంగాల్‌) అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.

మే 31న లెక్కింపు చేపడతారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్‌ మరణంతో యూపీలోని కైరానాకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్‌ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ మద్దతుతో లోక్‌దళ్‌ అభ్యర్థి తబస్సుమ్‌ ఆమెపై తలపడుతున్నారు. గోరక్‌పూర్, పూల్పూర్‌ ఫలితాలు   కైరానాలో పునరావృతమవుతాయని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో బీజేపీ ఎంపీ చింతామన్‌ వంగర మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరంగా వంగర కుమారుడు శ్రీనివాస్‌ శివసేన తరఫున బరిలో ఉండగా.. బీజేపీ నుంచి గవిట్‌ పోటీపడుతున్నారు. భండారా–గోండియా సిట్టింగ్‌ ఎంపీ ఆ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయి.

మరిన్ని వార్తలు