మరోసారి వాయిదా!

14 Jun, 2019 13:13 IST|Sakshi

బీజేపీ–శివసేనల మధ్య కుదరని సయోధ్య

ఇటు ముంచుకొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు

శివసేనకు డిప్యూటీ సీఎం పదవినిచ్చేందుకు బీజేపీ ఓకే

రెండు మంత్రి పదవులు కావాలంటున్న శివసేన

ఇరు పార్టీల మధ్య విభేదాలతో విస్తరణకు స్టాప్‌?  

సాక్షి, ముంబై :  రాష్ట్ర మంత్రిమండలి విస్తరణకు తేదీ ఖరారైనట్లు తెలుస్తున్నా.. అది మరోమారు వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు ముందుగా జూన్‌ 14వ తేదీన మంత్రి మండలిని విస్తరించనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే శివసేన, బీజేపీల మధ్య మంత్రి పదవుల కేటాయింపులపై విభేదాలు ఏర్పడటంతో మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ–సేనల మధ్య విభేదాలతో.. 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రిమండలిని విస్తరించడంతో పాటు అసెంబ్లీలో మంచి ఫలితాలు సాధించేందుకు పలువురు కొత్త ముఖాలతోపాటు బీజేపీలోకి చేరిన, చేరేందుకు సిద్ధంగా ఉన్న సీనియర్‌ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. అయితే మంత్రి మండలిలో పదవుల కేటాయింపుపై శివసేన, బీజేపీ నేతలలో విభేదాలు కన్పిస్తున్నాయి.  

శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి? 
కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్‌ మంత్రి పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేనను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టనున్న మంత్రి మండలి విస్తరణలో శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే శివసేన మాత్రం డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం వర్షకాలం సమావేశాలు (బడ్జెట్‌ సమావేశాలు) ప్రారంభానికి ముందే మంత్రి మండలిని విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 

అయితే  మంత్రిమండలి విస్తరణలో శివసేనకు లభించే మంత్రి పదవులపై కొంత అసంతృప్తి ఏర్పడిందని దీంతో ఈ మంత్రిమండలి విస్తరణ జాప్యమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిని శివసేనకు కేటాయించాలని బీజేపీ భావిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఏక్‌నాథ్‌ శిందే, సుభాశ్‌ దేశాయి పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఉప ముఖ్యమంత్రులకు బదులుగా మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని శివసేన కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. దీనిపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తుది నిర్ణయం తీసుకుంటారని శివసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు