‘ఇదే 56 అంగుళాల ఛాతీ’

26 Feb, 2019 17:40 IST|Sakshi

చండీగఢ్‌: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని పాకిస్తాన్‌ ఉగ్రమూకలకు చూయించాడని భారత వాయిసేన మంగళవారం వేకువజామున జరిపిన సర్జికల్‌ దాడుల అనంతరం హర్యానా బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేతలకు చెప్పారు. ‘ మోదీ ఏం చెప్తారో అదే చేస్తారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ ఎప్పుడూ చెబుతారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పారు. వాళ్లను(పాకిస్తాన్‌) వాళ్ల ఇంట్లోనే కొట్టాం. ఇదే 56 అంగుళాల ఛాతీ అంటే. ఇదే సింహం ఛాతీ అంటే’  అంటూ బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్‌, మోదీని ఆకాశానికెత్తేశారు. 

బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను విమర్శించడానికి  మోదీ తన 56 అంగుళాల ఛాతీని ఎన్నికల ప్రచార ఆయుధంగా తరచూ వాడేవారు. 2014కు ముందు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ను విమర్శించాల్సి వచ్చినపుడు కూడా ఛాతీ గురించి ప్రస్తావించారు. యూపీని, గుజరాత్‌లా తీర్చిదిద్దాలంటే మీకు(ములాయం) 56 అంగుళాల ఛాతీ ఉండాలని అప్పట్లో వ్యాక్యానించిన విషయాన్ని అంజివిజ్‌ గుర్తు చేశారు. 

హర్యానా కాంగ్రెస్‌ నాయకుల తీరును కూడా బీజేపీ ఎమ్మెల్యే అంజివిజ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇండియా పాకిస్తాన్‌ భూభాగంలో రెండో సారి సర్జికల్‌ దాడులు చేయడం యావత్‌ భారత్‌ గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న జైషే మహ్మద్‌ సంస్థ ఉగ్రవాద శిబిరంపై  వేకువజామున 3 గంటల సమయంలో 12 మిరాజ్‌ యుద్ధ విమానాలతో రెప్పపాటులో దాడి సుమారు 1000 కిలోల లేజర్‌ బాంబులను జారవిడిచిన సంగతి తెల్సిందే. మిరాజ్‌ యుద్ధ విమానాల ద్వారా సర్జికల్‌ దాడులకు దిగడంతో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు