ముగిసిన ఆరో విడత ప్రచారం

11 May, 2019 04:42 IST|Sakshi

రేపు 59 స్థానాలకు పోలింగ్‌

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ఆరోవిడతలో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఉన్న 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), పశ్చిమ బెంగాల్‌(8), ఢిల్లీ(7), జార్ఖండ్‌(4) రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో 45 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.

అయితే యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు సీట్ల కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బాక్సర్‌ విజేందర్‌ సింగ్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి హర్‌‡్ష వర్ధన్, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్, ఆప్‌ నేత అతీషీ ఢిల్లీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే యూపీ నుంచి కేంద్ర మంత్రి మేనకాగాంధీ, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఈ 8 సీట్లను నిలబెట్టుకోవడానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.  

మరిన్ని వార్తలు