నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

27 Mar, 2019 15:01 IST|Sakshi

పుర్ణియా: మద్యం సేవించి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని పోలీసులు కటకటాలవెనక్కు నెట్టిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పుర్ణియా స్థానం నుంచి రాజీవ్‌ కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. పూటుగా మద్యం సేవించి మంగళవారం నామినేషన్‌ వేసేందుకు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

అయితే బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో రాజీవ్‌ ప్రవర్తనపై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షించగా, ఆయన పూటుగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో మద్య నిషేధ చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. బిహార్‌లో ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరగనుంది. కాగా, పుర్ణియా లోక్‌సభ స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 11 మంది చివరిరోజున నామినేషన్‌ వేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు