చిక్కుల్లో కన్హయ్యకుమార్‌.. కేసు నమోదు!

7 Mar, 2019 13:31 IST|Sakshi

పట్నా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్‌ చిక్కుల్లో పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బిహార్‌లోని స్థానిక కోర్టులో ఆయనపై కేసు నమోదైంది. బిహార్‌లోని బెగుసరై నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున తొలిసారి లోక్‌సభకు పోటీచేసేందుకు కన్హయ్యకుమార్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కిషన్‌గంజ్‌లోని అంజుమాన్‌ ఇస్లామియా హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి రెచ్చగొట్టే రీతిలో కన్హయ్య వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మైనారిటీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టిటు బద్వాల్‌ స్థానిక కోర్టులో కేసు నమోదు చేశారు. కేసును స్వీకరించిన కోర్టు.. త్వరలోనే వాదనలు విననుంది. జేఎన్‌యూ క్యాంపస్‌లో దేశద్రోహ నినాదాలు చేశారని అభియోగాలు ఎదుర్కోవడం ద్వారా మూడేళ్ల కిందట కన్హయ్యకుమార్‌ ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు