హనుమంతుడి కులపత్రం ఇవ్వండి

8 Dec, 2018 02:26 IST|Sakshi

వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌లో పీఎస్‌పీఎల్‌ దరఖాస్తు

వారణాసి: హనుమంతుడు దళితుడంటూ మొదలైన చర్చ కొత్త మలుపు తిరిగింది. అంజనీపుత్రుడి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత శివపాల్‌ యాదవ్‌కు చెందిన పార్టీ నేతలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారంలోగా సర్టిఫికెట్‌ ఇవ్వకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో విభేదాల కారణంగా ములాయం సోదరుడైన శివపాల్‌ యాదవ్‌ అక్టోబర్‌లో ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ(పీఎస్‌పీఎల్‌)(లోహియా) స్థాపించారు. ఆ పార్టీ వారణాసి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరీశ్‌ మిశ్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘దైవ స్వరూపుడైన ఆంజనేయుడి కుల ధ్రువీకరణ పత్రం కోసం వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయంలో దరఖాస్తు చేశాం.

హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన్ను స్వార్థపూరిత కుల రాజకీయాల్లోకి లాగారు. అందుకే హనుమంతుడి కుల సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశాం’ అని తెలిపారు. దరఖాస్తులో హనుమాన్‌ తల్లిదండ్రులను మహారాజ్‌ కేసరి, అంజనాదేవీగాను ఆయన నివాసం ప్రముఖ సంకట్‌ మోచన్‌ ఆలయంగాను పేర్కొన్నారు. కులానికి సంబంధించిన కాలమ్‌లో దళితుడిగా, పుట్టిన తేదీని అనంతుడనీ, వయస్సును అమరుడు అని పేర్కొన్నారు. హనుమంతుడు దళితుడైనందున దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్‌ ఆలయాలను స్వాధీనం చేసుకుని, దళితులనే పూజారులుగా నియమించుకోవాలంటూ భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ దళితులకు శుక్రవారం పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు