బరిలో కుల సంఘాల నేతలు

20 Nov, 2018 02:00 IST|Sakshi

తుంగతుర్తి నుంచి అద్దంకి,సికింద్రాబాద్‌ నుంచి కాసాని

మిర్యాలగూడ నుంచి ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక ఉద్యమాలు చేసిన నేతలు తాజాగా సం‘కుల’ సమరంలోకి దిగారు. చట్టసభల్లో తమ వర్గానికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిథ్యం కల్పించేలా రిజర్వేషన్లు ఉండాలనే నినాదంతో దశాబ్దాలుగా ఉద్యమించారు. వీరంతా తాజా గా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. గతంలో 93 బీసీ కులాల ఐక్య వేదికను ఏర్పాటు చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ ఆ తర్వాత మన పార్టీని స్థాపించారు.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ టికెట్‌ దక్కించుకున్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమంలో ఉన్న ఆర్‌.కృష్ణయ్య తొలిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తర్వాత ఆ పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరించారు. తాజాగా కాంగ్రెస్‌తో జతకట్టారు. ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ మిర్యాలగూడ టికెట్‌ కేటాయించడంతో సోమవారం నామినేషన్‌ వేశారు.

మరోసారి తుంగతుర్తి నుంచి..
తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమాలు చేపట్టిన అద్దంకి దయాకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెం బ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను అనూహ్యంగా దక్కించుకున్నారు. తాజాగా అదే సెగ్మెంటు నుంచి మరోమారు పోటీకి సిద్ధమైన దయాకర్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితితో జాతీయ స్థాయిలో అందరిదృష్టిని ఆకర్షించిన మందకృష్ణ మాదిగ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు