సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీబీఐ విచారణ జరిపించడం తమ పార్టీకి ఇష్టం లేదని బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్చార్జి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 1600 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆ లెక్కలు అడుగుతుంటే చంద్రబాబు చెప్పడం లేదని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా మంజూరు చేయలేదని ఆరోపించారు. యుటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా రాష్ట్రానికి కేంద్రం నిధులు ఎలా మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. కక్షతో సీబీఐ దాడులు చేయించే సంస్కృతి బీజేపీది కాదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.