సాక్షి, హైదరాబాద్: భూముల రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రెవెన్యూ అధికారులు చేసిన అవకతవకలతో గ్రామాల్లో జరుగుతున్న హత్యలపై సమగ్రంగా విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారం డిమాండ్ చేశారు. భూప్రక్షాళన పేరుతో రాష్ట్రంలోని ప్రతీ అంగుళం భూమిని లెక్కించాలని సీఎం కేసీఆర్ చేసిన సూచనతో గ్రామాల్లో తగాదాలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
గ్రామస్థాయి అధికారి నుంచి మండల రెవెన్యూ అధికారి దాకా బడుగు, బలహీనవర్గాల వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పేదలను భయపెట్టి వెయ్యి నుంచి లక్ష రూపాయల దాకా దండుకుంటున్నారని ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగిన హత్య ఇలాంటిదేనని దీనిపై సమగ్ర విచారణ జరపాలని చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. హతుల కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను చెల్లించాలన్నారు.