‘స్పీకర్‌ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’

22 Jun, 2018 11:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడం హర్షణీయమన్నారు. 

సంవత్సరం పాటు పదవులను వదులుకోవడం మాములు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.  హోదా కోసం ఎవరు పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుందని చలసాని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని ఆయన అన్నారు. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చలసాని శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్‌ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, అధికార పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా కాలం గడిపేస్తోంది. 
 

మరిన్ని వార్తలు