సాక్షి, పాయకరావుపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై 36 సార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోరాటయాత్రలో భాగంగా శుక్రవారం పాయకరావుపేట బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) హయాంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కనీస ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు.
సామాజిక వెనుకబాటు తనాన్ని ప్రజల్లోకి పదునైన రచనలతో తీసుకెళ్లిన గురజాడ అప్పారావు జన్మించిన చోట అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు నదులను సైతం కబ్జా చేస్తున్నారని అన్నారు. విశాఖపట్టణం-చెన్నై కారిడార్ పేరుతో వేల ఎకరాలను సేకరించారని, పరిశ్రమల కోసం భూతద్దం వేసి వెతికినా దొరకడం లేదని మండిపడ్డారు.
ఇక వెనుకబడిన వర్గాల అభివృద్ధి జాడే లేదని, పాయకరావుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట నేటికీ నెరవేరలేదని అన్నారు. ఉత్తరాంధ్రలో వైద్య వ్యవస్థ నిద్రావస్థలో ఉందని ఆవేదన వెలిబుచ్చారు.