జాతీయ పార్టీగా బీజేపీకి ఇది తగదు

9 Mar, 2018 02:23 IST|Sakshi

అప్పుడు కాంగ్రెస్‌ చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ చేసింది

అసెంబ్లీలో బీజేపీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి: జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని, కానీ అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ వ్యవహరించిన తీరు సరిగా లేదని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. విభజనకు హేతుబద్ధత లేదని, పార్లమెంటులో తలుపు లు వేసి బిల్లును పాస్‌ చేశారన్నారు. బిల్లును ఆగమేఘాల మీద ఫ్లైట్‌లో తీసుకొచ్చారని.. ఇవన్నీ జరుగుతుంటే బీజేపీ నాడు ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ చేసిన తప్పులే బీజేపీ కూడా చేస్తోందన్నారు. రాజ్యసభలో హామీలను నెరవేరుస్తామంటేనే ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్లాం కానీ, ఇప్పుడు బీజేపీ చేసిందేమిటని ప్రశ్నించారు. అటు ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిందని, ఇలాంటి పరిస్థితిని కల్పించిన బీజేపీ చర్యలు సరైనవి కావన్నారు. సెంటిమెంటుతో డబ్బులు రావని, దేశ రక్షణ కోసం నిధులివ్వాలి కదా అనడమంటే.. రక్షణ నిధులు ఏపీకి ఇచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు.

తెలుగుజాతికి తీవ్ర అవమానం జరిగిందన్నారు. బీజేపీ హామీ ఇచ్చినవే అడుగుతున్నామని, కొత్తగా అడగడం లేదని, వీటిని గొంతెమ్మ కోర్కెలంటే ఎలా అని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇండస్ట్రియల్‌ ఇన్సెంటివ్‌లు ఎలా ఇస్తున్నారని, చివరకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన రూ.350 కోట్లు కూడా ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకోవడం దారుణమన్నారు.

మరిన్ని వార్తలు