అపాయింట్‌మెంట్‌ కోసం అడుక్కుంటున్నాడు

5 Apr, 2018 13:10 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ నాయకుల అపోయింట్మెంట్ కోసం అడుక్కుంటూ తిరుగుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కేవలం ఫోటో షూట్ కోసం ఢిల్లీ టూర్‌కి వెళ్లారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లలేదని ధ్వజమెత్తారు.

చంద్రబాబును చూసి జాతీయ పార్టీల నాయకులు నవ్వుకుంటున్నారని చెప్పారు. విజయ్ మాల్యాను కలిసారా లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరితే ఇంత వరకు దానిపై స్పందన లేదని మండిపడ్డారు.  ముందుగా చెప్పిన విధంగా రేపు వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకి రాజీనామా చేస్తున్నారని,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాము ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. చంద్రబాబును చూసి జాతీయ నాయకులు, ప్రజలు పారిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలు ఆడటం మొదలెట్టాయని విమర్శించారు.

అధికారం లోకి వచ్చాక ఒక్క హమీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి జిల్లాని హైదరాబాద్ చేస్తా అని చెప్పి..ఇంత వరకు కనీసం పట్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏపార్టీతో నైనా కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు