చంద్రబాబు నాకు ద్రోహం చేశారు

20 Sep, 2018 01:28 IST|Sakshi

ఆలేరునుంచి పోటీ చేస్తా: మోత్కుపల్లి

యాదగిరిగుట్ట (ఆలేరు): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకు తీరని ద్రోహం చేశారని, ఓ వ్యక్తిని రాజకీయంగా వాడుకొని వదిలేయడంలో బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతంలో తనకు గవర్నర్, రాజ్యసభ అభ్యర్థి పదవి ఇస్తానని మాటలు చెప్పి ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తన బతుకుని బజారులో పడేసి, ఆయన మాత్రం సుఖంగా ఉన్నారని, చంద్రబాబును నమ్మినందుకు గొంతు కోసినంత పని చేశారని ఉద్వేగంగా పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఆలేరు ప్రజలు అండగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ సీటు నుంచి పోటీలో ఉంటానని తెలిపారు.   

మరిన్ని వార్తలు