ఎల్‌జీ పాలిమర్స్‌కు మేం అనుమతివ్వలేదు

12 May, 2020 04:57 IST|Sakshi

హైకోర్టు సూచనల మేరకే అప్పట్లో చర్యలు తీసుకున్నాం 

కోటి పరిహారం కంపెనీని వెనకేసుకురావడానికే 

ప్రతిపక్ష నేత చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీకి తమ ప్రభుత్వం అనుమతులివ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తామే ఆ కంపెనీకి భూములిచ్చామనడం సరికాదన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం ఏపీలోని టీడీపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..  

► హిందుస్థాన్‌ పాలిమర్స్‌కు 1964 నవంబర్‌ 23న కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 2177 ద్వారా 213 ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమికి 1992 అక్టోబర్‌ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ నుంచి మినహాయింపులు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకే టీడీపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది. 
► ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్స్‌ ఉత్పత్తిని, స్టైరీన్‌ ఉత్పత్తితో ముడిపెట్టడం దివాలాకోరుతనం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే ఎక్స్‌పాండబుల్‌ పాలిస్టైరీన్‌ ఉత్పత్తికి అనుమతించి కేంద్రానికి సిఫారసు చేసింది.  
► గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో బిడ్డ చనిపోయి బాధలో ఉన్న తల్లి, తండ్రిపై కేసు పెట్టారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు అండగా ఉన్న ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టారు. కోటి వద్దు కూతురే కావాలనే తల్లిపై కేసు పెట్టడం అమానుషం. 
► లీకేజీ దుర్ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించి కంపెనీకి కొమ్ము కాయడం దారుణం. విమానాశ్రయంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం, కోటి పరిహారం ప్రకటించడం, మల్టీ నేషనల్‌ కంపెనీగా కితాబివ్వడం, అందులోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం అంతా వెనకేసుకురావడమే.  
► నిందితులకు సానుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడటం విచారణను నీరుగార్చడమే. కంపెనీని మూసేయాలని బాధితులు, స్థానికులు డిమాండ్‌ చేస్తుంటే అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎలా అంటారు?  
► ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ కంపెనీతో భారతి పాలిమర్స్, నందిని పాలిమర్స్‌కు ఉన్న వ్యాపార లావాదేవీలు ఏమిటి? 

>
మరిన్ని వార్తలు