నా దీక్షకు మద్దతు కూడగట్టండి

12 Nov, 2019 04:50 IST|Sakshi

టీడీపీ నేతలతో చంద్రబాబు 

సాక్షి, అమరావతి: ఈ నెల 14న విజయవాడలో తాను చేపట్టే ఒకరోజు దీక్షకు మద్దతు కూడగట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల వారిని దీక్షకు రప్పించాలన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఎం, ఆప్‌ తదితర పార్టీలు తన దీక్షకు మద్దతు తెలిపాయన్నారు.

బీజేపీ, జనసేన మద్దతు కూడా కూడగట్టాలన్నారు. పవన్‌ను ప్రత్యేకంగా కలవాలని ఆయన నాయకులకు సూచించారు. తాను ఆయనతో మాట్లాడతానని, ప్రతినిధి బృందంగా నాయకులు వెళ్లి కలవాలని చెప్పారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించామని, దీక్షకు ఆ పార్టీ నేతలను తీసుకురావాలని సూచించారు. భవన నిర్మాణ రంగ కార్మికులతోపాటు దానికి అనుబంధంగా ఉన్న పలు రంగాలకు చెందిన వారిని సమీకరించాలన్నారు. కాగా, దీక్ష సందర్భంగా తనకు మద్దతివ్వాలని కోరుతూ సోమవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు