ప్రజలొద్దంటే నమస్కారం పెడతా

22 Mar, 2019 02:28 IST|Sakshi

సొంత చిన్నాన్న చనిపోతే నాటకాలడుతున్నారు

వాళ్లింట్లోని వాళ్లే చంపేశారు..రేపు మిమ్మల్ని చంపించేస్తారు

అసలు జగన్‌కు ఒక్క అవకాశమైనా ఎందుకివ్వాలి?

విజయనగరం జిల్లా ఎన్నికల సభల్లో సీఎం వ్యాఖ్యలు

సాక్షిప్రతినిధి, విజయనగరం/సాలూరు/చీపురుపల్లి: ‘మోడీ, కేసీఆర్, జగన్‌ ముగ్గురూ ముసుగు తీసి కలిసి రండి మీ కథేంటో తెల్చేస్తా. చేతనైతే ధైర్యంగా రండి పోరాడుదాం. ఒక వేళ ప్రజలొద్దంటే నమస్కారం పెడతా’ అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లో గురువారం పర్యటించిన ఆయన విజయనగరం రోడ్‌ షోలో ప్రసంగించారు. దొంగలకు  కాపలాదారుడిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోతే జగన్‌ డ్రామాలాడుతున్నాడని, వాళ్ల ఇంట్లో వాళ్లే చంపారని, దానిని గుండెపోటు అని చెబుతున్నారని ఆరోపించారు. రేపు మిమ్మల్నీ చంపేసి  గుండెపోటు కింద  తోసేస్తారని తెలిపారు. వీళ్లు వస్తే పులివెందుల మాదిరి వీధికో రౌడీ తయారవుతాడని వైఎస్సార్‌ సీపీని ఉద్దేశించి అన్నారు. హోదా ఇవ్వటంతో పాటు  విభజన చట్టంలోని హమీలు అమలు చేయని పార్టీతో  జగన్‌ లంకె పెట్టుకున్నారన్నారు. కేసిఆర్‌ రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తామని చెబుతున్నాడని, అందుకోసమే వైఎస్సార్‌ సీపీకి రూ.వెయ్యి కోట్లు డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించారు. 

మొగుడూ, పెళ్లాలు  వేర్వేరుగా టీవీలు చూడ్డం నా ఘనతే!
ప్రతి ఇంట్లో మొగుడూ, పెళ్లాలు వేర్వేరుగా టీవీలు చూస్తున్నారంటే అది నా ఘనతేనని.. ఈ రోజు జనం వాడుతున్న సెల్‌ఫోన్లు తనవల్లే వచ్చాయని చంద్రబాబునాయుడు చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరు, చీపురుపల్లి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పిన మాట నిలుపుకున్నానని చెప్పారు. టీడీపీ యువత ఉత్సాహంగా ఉంటే వైఎస్సార్‌సీపీ యువత సారా తాగి పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానన్నారు.  మోదీ నమ్మక ద్రోహం చేశారనీ, ప్రజలకోసం పోరాడితే నన్ను భయపెడుతున్నారన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్‌ అంటున్నారని, మొత్తం దోచుకునేందుకేనని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు.  

మరిన్ని వార్తలు