తేనె పూసిన కత్తి.. మేకవన్నె పులి

10 Apr, 2019 10:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : తేనె పూసిన కత్తిలాంటివాడు.. దుర్మార్గుడు.. మేకవన్నె పులి.. గాడ్సేనే మించిన వాడు.. అభినవ ఔరంగజేబు.. మూర్తీభవించిన పదవీ కాంక్షగల ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు.. గూడు పుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం.. నా గుండెల్లో చిచ్చు రగిల్చాడు.. గొడ్డు కన్నా హీనుడు.. చీమల పుట్టలో పాములా చేరిన మోసగాడు.. తమ్ముళ్లారా.. చెల్లెళ్లారా.. ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి.

మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో, ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే నా ఈ ప్రయత్నం. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. 

ప్రజలు నన్ను నమ్మారు. నాకు ఓట్లు ఇచ్చారు. చంద్రబాబు  ప్రజల దగ్గరకు వెళ్లలేదు. ఓట్లు అడగలేదు. ఎవరిని గెలిపించడానికి కూడా ఆయనేమీ శ్రమ చేయలేదు. ఆయన చేసిందల్లా ఒక్కటే. ఎవరిని ఏ విధంగా లోబర్చుకోవాలో.. ఏ ప్రలోభంతో ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలో ఆ ప్రయత్నాలు మాత్రమే చేశాడాయన.

  నాతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్లు నా తమ్ముళ్లు, నాచెల్లెళ్లు, నా శాసనసభ్యులు ఉన్నారు. వారికి తెలుసు. నాకు తెలుసు. అయినప్పటికీ వారందరూ చంద్రబాబు ప్రలోభానికి లోనయ్యారంటే ఏవిధమైన ప్రలోభాలతో వారిని లోబర్చుకున్నారో ప్రజలు ఆలోచించాలి. అది నా తమ్ముళ్లది తప్పుకాదు. ప్రలోభ పెట్టిన వాడిదే.. చంద్రబాబుదే తప్పు. 

రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు. రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు తండ్రి దశరథుడు. కానీ పట్టాభిషేకం జరగక ముందే రాముడు అరణ్య వాసానికి పంపించబడ్డాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎదుర్కొన్నాడు. ఎంతో మంది స్వార్థపరులను మనం ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. లక్ష్మీపార్వతి పట్టాభిషేకం కోరలేదు. నా భార్యగానే ఉండాలనేది ఆమె కోరిక. అందుకే నా గృహిణిగా వచ్చింది. వారసత్వమంటే ఇంటికి ఉండొచ్చు.. ఆస్తులకు ఉండొచ్చు.. మరోదానికి ఉండొచ్చు కానీ పార్టీలో కూడా వారసత్వముంటుందని నేను అనుకోలేదు.  

ఎన్టీఆర్‌ చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనంటే చంద్రబాబు ఎంత ద్వేషంతో రగిలిపోతున్నారో, ఆయన పేరునే తెరమరుగు చేసేందుకు ఎలా కుట్ర పన్నుతున్నారో.. తోకపత్రిక యజమాని రాధాకృష్ణ వద్ద 
ఆయన చేసిన వ్యాఖ్యలు (సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది) స్పష్టం చేస్తున్నాయి. 

చంద్రబాబు వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయాక ఎన్టీఆర్‌ సింహగర్జన సభలో, ఆయా సందర్భాల్లో బాబును దునుమాడుతూ నిప్పులు చెరిగారు. అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి, అడ్డదారిలో డబ్బు మూటలతో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి సీఎం పీఠాన్ని, తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు. ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసిన వైస్రాయ్‌ హోటల్‌ వద్దకు వెళ్లిన ఎన్టీరామారావుపై చెప్పులు వేయించి ఆయన్ను తీవ్రంగా అవమానించారు.

ఆ ఘటనతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఎన్టీరామారావు కుంగిపోయి చివరకు చంద్రబాబు చేసిన ఘోరానికి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్ఛరించేందుకు కూడా ఇష్టపడలేదని ఆయన మాటల్ని బట్టే అర్థమవుతోంది. పిల్లనిచ్చిన మామనే అంతగా వేధించిన ఘన చరిత్ర చంద్రబాబుది. 

224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని కొన్ని వ్యతిరేక శక్తులు 1995లో లోలోన గూడుపుఠాణీ ఆరంభించాయి. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉండి మామ ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు నాకు హితవు చెప్పారు. కానీ పశ్చాత్తాప పడ్డాడనే ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టించుకోలేదు.

అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందని, అధికారం కోసం ఇంతటి అల్పమైన, నీచమైన, దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేనూ సహించలేకపోయాను. నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట.

ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ, ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది. చంద్రబాబు.. ఆ మేకవన్నె పులి.. ఆ తేనెపూసిన కత్తి తయారు చేసిన కుట్రదారులకే జరిగింది. అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చెలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది. 

పేరు ఉచ్ఛరించేందుకూ అనర్హుడే 
ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి (చంద్రబాబు) ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను పదవులిచ్చాను. ఆయన ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా 1994 ఎన్నికల్లో మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు. కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130 లేదా 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు.

మాకిది కావాలి, అది కావాలంటూ కోరేవారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం కూడా నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్‌ ఏ ప్లాన్డ్‌ ట్రెచెరీ (విశ్వాస ఘాతుకం). 

మరో ఔరంగజేబు 
చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు.

ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటు సమయంలో) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో.. అవమానకరంగా వ్యవహరించారో.. తెలుగుజాతిని కించపరిచారో.. ఆ మహానుభావుడే ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు..’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు?           

ఎలా మోసం చేశాడో మనసుపెట్టి ఆలోచించండి 
చంద్రబాబుకు నా రక్తం పంచుకుపుట్టిన నా కూతుర్ని ఇస్తే.. తండ్రి లాంటి వాడిని ఏవిధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలని అడుగుతున్నాను. చంద్రబాబు మనిషి అయితే అలా చేసేవాడా అని అడుగుతున్నాను. ప్రజలు నన్ను నమ్మారు. నాకు ఓట్లు వేశారు. ఓట్టు వేశారంటే రామారావు కోసం వేశారు. తెలుగుదేశం అంటే రామారావనే వేస్తారు. ఈ మోసగాళ్లు ప్రజలకు జవాబు చెప్పాలి. నామిత్రులు వచ్చారు. మేము కూడా ఒక క్యాంపు పెడతామన్నారు.

కానీ నేను వద్దని చెప్పాను. ఐడోంట్‌ వాంట్‌. అందరినీ మనుషులుగా బతకనిస్తాను తప్ప ఎక్కడో నిర్బంధించి జంతువుల్లాగ అక్కడ ఉంచడానికి నేను అంగీకరించను. వారంతా నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. వారిని స్వేచ్ఛగా తిరగనివ్వండి. కావాలనుకుంటే వారు నాతో  ఉంటారు.. లేదంటే వెళ్తారు. నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తాం.. గొంతులు కోస్తాం.. అని నిరూపించుకున్న ఘాతకుడు వాడు (చంద్రబాబు). వాడిని చరిత్ర మరువదు. ఎవరైతే దేశానికి, ప్రజాస్వామ్యానికి సేవ చేస్తారో వారే నిజమైన వారసులవుతారు. రాజకీయాల్లో వారసత్వముండదనేదే నా అభిప్రాయం. 

గాడ్సేను మించినవాడు.. 
ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు. ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది.

ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి ఎన్టీఆర్‌ చేసిన తప్పు? ఏమిటి ఎన్టీఆర్‌ చేసిన నేరం? అయామ్‌ ద లయన్‌. నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళ్లు, నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ  క్షమించదు. 

ఆ మహానుభావుడే ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు..’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు?  

మరిన్ని వార్తలు