తిరగబడ్డ తీర్మానం

14 Mar, 2018 00:55 IST|Sakshi

విభజన చట్టం హామీల అమలులో కేంద్రం తీరుకు నిరసన

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం

కేంద్ర మంత్రుల రాజీనామాల తరహాలోనే మొక్కుబడి తంతు

ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌ ప్రస్తావనే లేదు

హోదా ఇవ్వక పోతే ఏం చేస్తామన్న కార్యాచరణ లేదు..

ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అవిశ్వాసం, రాజీనామాల ప్రస్తావన లేదు.. 

సాక్షి, అమరావతి: ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాలు, తీసుకుంటున్న ‘యూ టర్న్‌’లు అసెంబ్లీ వేదికగా మరోసారి బయటపడ్డాయి. విభజన చట్టం, రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. దీన్ని బట్టి ప్రత్యేక హోదాపై ఆయనకున్న చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏడాది కిందట ప్యాకేజీని ఆహ్వానిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేసిన చంద్రబాబు ఇపుడు దానికి విరుద్ధంగా తీర్మానం చేశారు.

తీర్మానంలో ఎక్కడో లోపల..‘ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నపుడు మాకెందుకివ్వరు’ అన్న డొంకతిరుగుడు సణుగుడు తప్ప మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న డిమాండ్‌ లేదు. దీన్ని అమలు చేయకపోతే ఏం చేస్తామన్న కార్యాచరణ ప్రణాళిక ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి ప్రసంగంలో కూడా హోదా ఇవ్వక పోతే తాము ఏం చేస్తాం అన్న స్పష్టత లేదు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాసం పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ ఆరున మా ఎంపీలు రాజీనామాలు చేస్తారు.. మీ ఎంపీలు కూడా ముందుకొచ్చి మొత్తం 25 మంది ఎంపీలూ రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది.. అని పిలుపునిచ్చింది. ఈ రెండింటి గురించి కూడా అటు తీర్మానంలో గానీ, ఇటు ముఖ్యమంత్రి ప్రసంగంలో గానీ ప్రస్తావన చేయలేదు. ప్రజల్లో ప్రత్యేక హోదా భావోద్వేగాలు ప్రబలిన నేపథ్యంలో ఓ కంటితుడుపు చర్యగా మంత్రులతో రాజీనామాలు చేయించారు.

మంత్రులతో రాజీనామాలు చేయించి ఎన్డీయేలో కొనసాగుతున్నట్లుగానే.. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తీర్మానంలో కోరుతూ 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు కాబట్టి మిగిలిన రాష్ట్రాల మాదిరిగా మాకెందుకు హోదా ఇవ్వరు అని డొంకతిరుగుడు ప్రస్తావన చేశారు. ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను గమనించి ఏదో మొక్కుబడి తీర్మానం చేసినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ‘‘ఈ తీర్మానం చేస్తున్నాం.. దీనిని కేంద్రానికి పంపిస్తున్నాం.. కేంద్రం స్పందించకపోతే మేము ఏం చేస్తాం’’ అనే స్పష్టత లేకుండా.. ఎప్పటిలాగే ప్రతిపక్షంపై విమర్శలు కురిపించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఒకవైపు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. ఇద్దరం కలసి ఈ పోరాటం చేద్దాం అని అది ఆహ్వానించింది. అవిశ్వాస తీర్మానం పెట్టడం, 25మంది ఎంపీల రాజీనామాలు.. ఈ రెండు విషయాలపై మాత్రం ముఖ్యమంత్రి తీర్మానంలో గానీ తన ప్రసంగంలో గానీ స్పందించలేదు. ఎలాంటి ఉపయోగమూ లేని మొక్కుబడి తీర్మానం చేశారు.

తాజా తీర్మానంలో ఏముందంటే...
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానంలో ‘రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని శాసనసభ తీవ్రంగా ఖండిస్తోంది’అని చెప్పారు. ‘‘14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. ఇప్పుడు హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమని కేంద్రం చెప్పింది. హోదా బదులు దానికి సమానమైన ప్రయోజనాలు కల్పించేలా ప్రత్యేక సహాయం ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి రాష్ట్రానికి నిధులు పెద్దగా రాకపోగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కొనసాగిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదనీ.. అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షులు, సభ్యులు బహిరంగంగా చెప్పారు’’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక సహాయం ప్రకటనపై సెప్టెంబరు 9, 2016న శాసనసభలో చర్చ సందర్భంగానూ,  ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పించిందని కేంద్రాన్ని అభినందిస్తూ మార్చి 16, 2017న తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగానూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా సిఫార్సు చేయలేదని.. ఆ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పారని కూడా సాక్ష్యాలతో సహా సభ ముందు ఉంచారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వకూడదంటూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని చంద్రబాబు ఆ రోజు బుకాయించారు. ఇపుడు ఆయన ఆ విషయంలోనూ యూటర్న్‌ తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా సిఫార్సు చేయలేదని అదే చంద్రబాబు ఈరోజు సభాముఖంగా సెలవిచ్చారు.


ప్రజల సెంటిమెంట్‌తో చెలగాటం
ప్రజల్లో సెంటిమెంట్‌ నానాటికీ బలపడుతుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆగస్టు 31, 2015న ఒక సారి.. మార్చి 16, 2016న మరో సారి కంటితుడుపుగా చంద్రబాబు శాసనసభలో తీర్మానాలు చేయించారు. ఆ తర్వాత ఐదు నెలల్లోనే మాట మార్చారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు.. ఆ హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బావుకున్నాయి.. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తే వద్దంటామా అన్నారు. దాంతో సెప్టెంబరు 7, 2016న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించిన వెంటనే..  చంద్రబాబు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ దాన్ని స్వాగతించారు. ఆ తర్వాత ఆ ప్రత్యేక సహాయానికి కేంద్ర మంత్రి మండలి ‘చట్ట బద్ధత’ కల్పించిందంటూ మార్చి 16, 2017న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ నానాటికీ బలీయంగా మారుతుండటం.. ఉద్యమ ఫలాలన్నీ నాలుగేళ్లుగా పోరాడుతున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతాయని ఆందోళన చెందిన సీఎం చంద్రబాబు..  ప్రత్యేక సహాయం అమలు కాలేదంటూ.. ప్రత్యేక హోదా కల్పించాలంటూ.. ‘యూ’టర్న్‌ తీసుకున్నారు. ఇందులోనైనా చిత్తశుద్ధి ఉందా అంటే.. లేదని శాసనసభ సాక్షిగా మరో సారి వెల్లడైంది. 

నాడు మోదీకి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీలో బాబు తీర్మానం 
ప్యాకేజీకి కేంద్రం అధికార ముద్ర వేసిందంటూ ప్రధానమంత్రి మోదీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు తీర్మానం చేశారు. గత ఏడాది మార్చి 16న ఆ తీర్మానాన్ని  చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఏమన్నారంటే.. ‘‘ప్రత్యేక హోదా ప్రయోజనాలతో లబ్ది చేకూర్చే ప్రత్యేక ఆర్థిక సహాయానికి అధికారికంగా ఆమోదం తెలియజేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ధన్యవాదాలు తెలియజేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలు, ప్రతిపత్తి లేని రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపలేదు.  ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా ఉనికి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏపీకి అయిదేళ్ల పాటు హోదా కు సమానమైన ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ సహాయం 20–02–2014న అప్పటి ప్రధాని ప్రకటనకు అనుగుణంగా 2015–16 నుంచి 2019–20  మధ్య రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇచ్చి ఉంటే కలిగే లాభానికి సమానంగా ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరాల్లో విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల ఒప్పందాల మేరకే కేంద్రంనుంచి ఈ సహాయం అందుతుంది.  కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తుంది. జరిగిన ఖర్చును  కేంద్రం 100% భరిస్తుంది. 14వ ఆర్థిక సంఘం, నీతి అయోగ్‌ సిఫార్సుల నేపథ్యంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందిస్తామని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన ద్వారా కేంద్రం తెలియజేసింది. ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ రాష్ట్రానికి ప్రత్యేక సహాయాన్ని ఈఏపీ రూపంలో అందించడానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి అంగీకరిస్తూ తీర్మానించింది. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరపున ప్రధాని మోదీకి, కేంద్రం ఇచ్చిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అంశంపై మొదటి నుంచి తోడ్పాటునిచ్చిన కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమా భారతి, నిర్మలా సీతారామన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై శ్రమించిన కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, వైఎస్‌ చౌదరిలను అభినందిస్తున్నాం.’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. 

ప్యాకేజీకి కేంద్రం అధికార ముద్ర వేసిందంటూ ప్రధాని మోదీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు తీర్మానం చేయటంపై ప్రచురితమైన వార్త 


ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై సెప్టెంబర్‌ 9, 2016న శాసనసభలో చర్చ సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రకటన 

>
మరిన్ని వార్తలు