పెదబాబుకు చినబాబు టెన్షన్‌

12 Mar, 2019 05:05 IST|Sakshi

‘నాన్నగారు! నేనూ ఎన్నికల ప్రచారానికెళ్తా...’ అని చినబాబు లోకేశ్‌ అడిగినప్పుడల్లా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ఎక్కడ నోరు జారి ఏం మాట్లాతాడోనని భయం పట్టుకుందట. ఇప్పటికే అనేకసార్లు తన మిడిమిడి జ్ఞానంతో చేసిన కామెంట్లతో చంద్రబాబుతో పాటు టీడీపీ పరువు గంగలో కలిసింది. ఎంత ట్రైనింగ్‌ ఇచ్చినా చినబాబు ప్రసంగ ధోరణిలో మార్పు లేకపోవడంతో ఈ సారి ఏం కొంప ముంచుతాడోనని చంద్రబాబుకు తెగ టెన్షన్‌ పడుతున్నారట. సొంత పార్టీనే భూస్థాపితం చేయాలంటూ లోకేశ్‌ చేసిన ప్రసంగం ఇప్పటికీ పెదబాబు చెవుల్లో మార్మోగుతూనే ఉంది. కాగా లోకేశ్‌ను ప్రచారానికి వద్దంటే ఇంట్లో ఊరుకునేలా లేరట.

ఎటూ పాలుపోని స్థితిలో ఈ మధ్య ఓ జ్యోతిష్యుడ్ని భవిష్యత్‌ ఏంటని అడిగారట బాబుగారు. ‘రాహుకాలంలో పుత్రుడితోటే ఇబ్బంది’ అని ఆ పండితుడు ఓ వార్నింగ్‌ ఇచ్చాడట. దీంతో చంద్రబాబు మరింత బెంబేలు పడుతున్నారని సమాచారం. ఓ ట్యూటర్‌ను పిలిపించి లోకేశ్‌కు రాజకీయ ప్రసంగాలపై శిక్షణ ఏర్పాట్లు చేశారట. అక్కడ ఓకే అని సర్టిఫికేట్‌ వస్తే... కొన్ని నియోజవర్గాలను ఎంపిక చేసి, ఎన్నికల ప్రచార పైలెట్‌ ప్రాజెక్టు ఇవ్వాలనేది బాబు వ్యూహమట. ఇక లోకేశ్‌ ప్రచారం చేస్తారని తెలిస్తే ఆ ప్రాంత తమ్ముళ్లు ఉలిక్కి పడుతున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద చినబాబు ఎక్కడ ప్రచారానికి వెళ్తారో... ఎవరికి ఏ ముప్పు తీసుకొస్తారోనని పార్టీ వర్గాల్లో జోరుగా విన్పిస్తోంది.  
– సాక్షి, అమరావతి

మరిన్ని వార్తలు