‘రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం’

17 Feb, 2019 11:58 IST|Sakshi

బీసీలకు మేలు జరగాలంటే వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం: వరప్రసాద్‌

సాక్షి, ఏలూరు : రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్‌ రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం అని ఆ పార్టీ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. ఏలూరు నగరంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజి కవర్గాల ప్రజలతో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  భారీ ఎత్తున బీసీ గర్జన మహాసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మహాసభ ప్రాంగణం వద్ద బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే వైఎస్ జగన్‌ ప్రభుత‍్వం రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడివి ఓటు బ్యాంక్‌ రాజకీయాలని, నాలుగేళ్లుగా ఆయనకు బీసీలు గుర్తుకు రాలేదా అని బొత్సా సూటిగా ప్రశ్నించారు. 

వైఎస్‌ జగన్ వల్లే సాధ్యం
వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఎన్నికల వేళ బీసీ కులాలకు ఏదో మేలు చేస్తామని, ఆయన మాయమాటలు చెబుతున్నారన్నారు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బీసీలకు ఎంతో మేలు జరిగిందని, మరోసారి బీసీలకు మేలు జరగాలంటే వైఎస్‌ జగన్ వల్లే సాధ్యమని వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు