‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

20 May, 2019 14:08 IST|Sakshi

సాక్షి, కాకినాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. అందుకే ఆయన ఎక్కే గుమ్మం...దిగే గుమ్మం చేస్తున్నారన్నారు. కన్నబాబు సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి ఎగ్జిట్‌ పోల్స్‌...చంద్రబాబుకు పొలిటికల్‌ ఎగ్జిట్‌ పోల్‌ అని వ్యాఖ్యానించారు. 2014లో ఇవే ఈవీఎంలపై గెలిచిన ఆయన ఇప్పుడు వాటిని తప్పుబడితే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. అలా అనుకుంటే ఆనాడు చంద్రబాబు గెలుపు కూడా తప్పే అని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రోజుకో డిమాండ్‌ ఎన్నికల సంఘం ముందు ఉంచుతున్నారన్నారు. ఆయనను అలాగే వదిలేస్తే ఎన్నికల కౌంటింగ్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించమని డిమాండ్‌ చేస్తారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని కన్నబాబు సూచించారు.

అన్ని సంస్థల సర్వే నివేదికలు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వస్తే.. లగడపాటి రాజగోపాల్‌ మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్పారని విమర్శించారు. లగడపాటి సర్వేలకు క్రెడిబులిటి ఏనాడో పోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే లగడపాటి సర్వే అని కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎగ్జిట్‌ పోల్స్‌... చంద్రబాబుకు పొలిటికల్‌ ఎగ్జిట్‌ పోల్స్

>
మరిన్ని వార్తలు