నారాసుర రక్తచరిత్ర

17 Mar, 2019 08:41 IST|Sakshi

ఉన్నత స్థానానికి ఎదగడానికి కుట్రలు, కుతంత్రాలు, హత్యల మార్గాన్నే ఎంచుకున్న చంద్రబాబు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చెమట చిందించడం ఒక మార్గం.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలతో రక్తపుటేరులు పారించడం మరొక మార్గం. మనందరం కష్టాన్ని, తెలివితేటల్ని, చెమట చిందించే మార్గాన్ని నమ్ముకుంటాం.. కానీ.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం..   వెరసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్న రెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు.. రెండో మార్గాన్నే ఎంచుకున్నారు..

విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు.  విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక..  కుట్రలు, కుతంత్రాలు, హత్యారాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్‌గా మారారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే..!

ప్రజాపోరాటాలతో తిరుగులేని నేతగా ఎదిగి.. తనకు కంటగింపుగా మారిన వంగవీటి మోహన రంగా దారుణ హత్య నుంచి మొదలైన నారాసుర రక్త దాహం.. ఎన్‌కౌంటర్‌ పత్రిక ఎడిటర్‌ పింగళి దశరథరాం.. నాడు సీఎం ఎన్‌టీఆర్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావు.. కడప లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటసుబ్బయ్య.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి.. నిన్నటికి నిన్న వైఎస్‌ సోదరుడు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని కిరాతకంగా అంతమొందించడం వరకూ.. ఆ హత్యాకాండ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. తీరని అధికార దాహంతో నారాసురుడు గత నలభై ఏళ్లుగా సాగిస్తున్న దారుణ మారణ కాండలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! పరోక్షంగా తెగిన నరకంఠాలకు లెక్కేలేదు!!

ముఖ్యంగా నారాసురుడు తన రాజకీయ ప్రాబల్యం నిరాటంకంగా కొనసాగించుకునేందుకు.. అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కడతేర్చాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నడం విస్తుగొల్పుతోంది అంటున్నారు పరిశీలకులు. ఆ మహానేత కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు బలైపోగా.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తనపై జరిగిన హత్యాయత్నం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.  
                        
ఓ అనామకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. ఇలా అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ.. ఎదురొచ్చిన వారిని అత్యంత కిరాతకంగా అడ్డుతొలగించుకుంటూ.. ఎదిగిన నారాసురుడి ఆ రక్తచరిత్ర పుటలను తిరగేస్తే.. పేజీకో కుట్ర, కుతంత్రం, కుటిల నీతి, హత్యలు కన్పిస్తాయి. రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి హత్యా రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారు. అలాంటి నారాసురుడి నలభై ఏళ్ల రక్త చరిత్ర..


సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మృదుస్వభావి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని సొంతింట్లో కిరాతకంగా హత్యకు గురైన సంఘటన గురించి సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే ఇందులో ఆయన హస్తం ఉందని వైఎస్‌ అభిమానులు, కుటుంబ సభ్యులే కాదు.. పలు రాజకీయ పార్టీల సీనియర్‌ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని చెబుతున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి, గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే..

విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఏప్రిల్‌ 20, 1950న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక అయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడుకి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి.

మహానేత సహకారంతో మంత్రి పదవి
దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు– ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థపరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్‌టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్‌టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్‌టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు– చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు.  వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్‌టీఆర్‌ చేరదీశారని టీడీపీ సీనియర్‌ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా

  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్‌టీ రామారావు మంత్రివర్గంలోనూ, టీడీపీలోనూ నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. జనవరి, 1984 నాటికి ఎన్‌టీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్‌టీఆర్‌పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి..హత్యాయత్నం చేయించి..ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్‌రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి.  
  • నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటులో ఎన్‌టీఆర్‌ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్‌టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటాన్ని చేశారు. కానీ.. ఎన్‌టీఆర్‌కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు ఆరోపించారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్‌టీఆర్‌ దన్నుతో కర్షక పరిషత్‌ ఛైర్మన్‌గా దొడ్డిదారిన పదవిని పొంది.. ఓ వర్గం నేతలను చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని అప్పట్లో పలువురు నేతలు అధినేతకు ఫిర్యాదులు కూడా చేశారు.  

  • విద్యార్థి దశలోనే కుల రాజకీయాలతో ఎస్వీ యూనివర్శిటీని భ్రష్టు పట్టించారంటున్న నాటి విద్యార్థులు
  • అస్థిత్వం కోసం టీడీపీలో చేరి కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో ఎదిగారంటున్న సీనియర్‌ నేతలు
  • టీడీపీపై పట్టు కోసం ఎన్‌టీ రామారావుపై మల్లెల బాబ్జీతో హత్యాయత్నం చేయించారని ఆరోపించిన మాజీ సీఎం నాదెండ్ల
  • వంగవీటి రంగాను అంతమొందించడంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేసిన సీనియర్‌ నేత చేగొండి హరిరామజోగయ్య
  • 1995 నుంచి 2004 మధ్య కాలంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడి తుదముట్టించారంటున్నరాజకీయ పరిశీలకులు
  • రాజకీయ ప్రాబల్యం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కడతేర్చేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు
  • మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో మరోసారి చంద్రబాబు తన క్రూర స్వభావం బయటపడిందంటున్న సీనియర్‌ రాజకీయ నేతలు

తొమ్మిదేళ్ల పాలనలో రక్తపుటేరులు

  • ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం ద్వారా సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 నుంచి 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ ను రాజేసి.. అధికారాన్ని     అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి.
  • అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
     
  • రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూల్‌లో ఫ్యాక్షన్‌  రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
  • కడప జిల్లాలో ఫ్యాక్షన్‌  తారాస్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్‌ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి.  
  • 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్‌ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు.  

 
వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర
రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజాపోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌కు తెలియకుండా కుట్ర చేసి.. డిసెంబర్‌ 26, 1988న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణదీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్‌ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు.  

  • అదేవిధంగా నాడు సీఎం ఎన్‌టీఆర్‌  కార్యదర్శిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావును.. చంద్రబాబు కుట్ర చేసి యాక్సిడెంట్‌లో చంపేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
  • ఎన్‌కౌంటర్‌ పత్రిక ఎడిటర్‌ పింగళి దశరథరాం దారుణ హత్యకు చంద్రబాబు నాయుడు కారకుడనే విమర్శలు వచ్చాయి.  

కడప లోక్‌సభ ఎన్నిక వాయిదా కోసం హత్య
దేశ వ్యాప్తంగా 1991లో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోటీ చేశారు. వైఎస్‌ని ఓడించాలనే లక్ష్యంతో ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయించాలని చంద్రబాబు కుట్ర చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటసుబ్బయ్యను అంతమొందించడానికి వ్యూహం రచించారని.. దాన్ని అమలు చేసి ఆయన్ని హత్య చేయించారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వెంకటసుబ్బయ్య హత్యతో కడప లోక్‌సభ స్థానం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ లోక్‌సభ స్థానానికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించేలా చేసినా.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయదుందుబికి అడ్డుకట్ట వేయలేకపోయారు.

రంగాది టీడీపీ ప్రభుత్వ హత్యే
వంగవీటి మోహనరంగాను అప్పటి టీడీపీ ప్రభుత్వమే హత్య చేయించింది. రంగా హత్యతో దేవినేని నెహ్రూకు ఎలాంటి సంబంధం లేదు. 1988లో టీడీపీ ప్రభుత్వం పాల ధర లీటర్‌పై రూ.2 పెంచింది. దీంతోపాటు ఆర్టీసీ ఛార్జీలూ పెంచింది. టీడీపీ సర్కార్‌ ప్రజాకంఠక విధానాలపై రంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేయడంతో టీడీపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. 1988లో డిసెంబర్‌ 20న మొగల్రాజపురంలో ఇంటి పట్టాల పంపిణీ వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతానికి వెళ్తున్న రంగాను అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాద్‌రావు కార్యక్రమం ఉందనే నెపంతో ఏసీపీ అడ్డుకున్నారు. దీనికి నిరసనగా రంగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడి వచ్చిన కోడెల ప్రభుత్వానికి రంగా పెద్ద తలనొప్పిగా మారారని అన్నారు. అప్పటి నుంచే రంగా హత్యకు టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధానంగా చంద్రబాబు రంగా హత్యకు స్కెచ్‌ వేశారు. 1988, డిసెంబర్‌ 26న ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను దీక్షా శిబిరంలోనే అంతమొందించారు. విచారణ సమయంలో ఇదే అంశాన్ని సీబీఐ అధికారులు మాట్లాడుకుంటుండగా నేను విన్నా. సీబీఐ విచారణలో భాగంగా కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన నన్ను నెహ్రూ వద్దకు కూడా తీసుకెళ్లారు. అప్పటి సీఐలు శివాజీ, విజయ్‌బాబులు రంగా హత్యతో నెహ్రూకు సంబంధం లేదని, చంద్రబాబే ఈ హత్య చేయించారని అనుకుంటుండగా కూడా నేను విన్నా.  –గాళ్ల సుబ్రమణ్యం, జాతీయ అధ్యక్షుడు, కాపునాడు

వెన్నుపోటుతో ఎన్‌టీఆర్‌ కన్నుమూత
కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్‌టీఆర్‌కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైశ్రాయ్‌ హోటల్‌లో నిర్భందించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్‌టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగద్విదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్‌.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు. చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్‌టీఆర్‌.. వైశ్రాయ్‌ హోటల్‌ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్‌టీఆర్‌ కన్నుమూయడానికి కొద్దిరోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి.  

అధికారం అండతో హత్యాకాండ
ఐదేళ్లుగా టీడీపీ పాలనలో సాగుతున్న హత్యాకాండలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.   

  • 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు.  
  • 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్‌సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డారు.  
  • 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు.   
  • 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు.  
  • 2014 సెప్టెంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం  కణేకల్‌ మండలం హనుమాపురం సర్పంచ్‌ విశ్వనాథ్‌ ప్రాణం తీశారు.
  • 2014 సెప్టెంబర్‌ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైసీపీ కార్యకర్త గోవింద్‌రెడ్డి హత్యకు గురయ్యాడు.  
  • 2014 నవంబర్‌ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్‌సీపీ నేత ప్రభాకర్‌నాయుడు హత్యకు గురయ్యారు.  
  • 2014 డిసెంబర్‌ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్ర హత్యను హత్య చేశారు.  
  • 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని సింగిల్‌విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి.  
  • 2015 ఏప్రిల్‌ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్‌సీపీ మండల మాజీ కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డిని రాప్తాడు తహశీల్దార్‌ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగినట్టు సమాచారం.  
  • 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు.  
  • 2015 అక్టోబర్‌ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్‌సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు.
  • 2016 డిసెంబర్‌ 9న వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్‌ సైకిల్‌పై రామిరెడ్డి వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు.  
  • 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన బావమరిదిని దారుణంగా హత్య చేశారు.   

పింగళి దశరథరామ్‌(జర్నలిస్టు)...  
తమ అక్రమాలు, ఆగడాలను ప్రశ్నించిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్‌కౌంటర్‌’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్‌ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్‌గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. కారంచేడు దళితులపై దాడులను, అప్పటి మంత్రి కోడెల శివప్రసాదరావు తదితరుల అవినీతి, అక్రమాలపై తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్‌ 20వ తేది రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్‌ను గూండాలు అత్యంత కిరాతంగా హత్య చేశారు. ఈ హత్య చేయించిందని చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు.  

ముత్యాల శోభనాద్రి..
వంగవీటి రంగా ముఖ్య అనుచరుడే ముత్యాల శోభనాద్రి. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగా నిర్వహించే ధర్నాల్లో కీలకపాత్ర పోషించేవారు. దీంతో ఆయన్ని మట్టుబెట్టాలని టీడీపీకి చెందిన దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని మురళి నిర్ణయించుకున్నాడు. శోభనాద్రి 1987 మే 17న తన ఇంటి నుంచి స్కూటర్‌పై సూర్యారావుపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లాడు. గర్భిణి అయిన కుమార్తెకు పళ్లు, పూలు ఇవ్వబోతుండగా వెనుక నుంచి వచ్చిన మురళి, ఆయన అనుచరులు శోభనాద్రిని మట్టుబెట్టారు. శోభనాద్రి చనిపోయే నాటికి ఆయన పెద్ద కుమారుడు నాగేంద్రబాబుకు 18 ఏళ్లు. శోభనాద్రి హత్య తర్వాత తమ వ్యాపారాన్ని నెహ్రూ హస్తగతం చేసుకోవడంతో రోడ్డున పడ్డామని.. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొని జీవిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు