మైలేజ్‌ కోసం చంద్రబాబు తాపత్రయం: అంబటి

20 Sep, 2019 17:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘సాధారణంగా సహచరులు చనిపోయినప్పుడు భావోద్వేగాలు సహజం. అయితే చంద్రబాబు నాయుడులో అలాంటి భావోద్వేగాలు కనిపించలేదు.  పార్టీ సీనియర్‌ నేత చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. కోడెల చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. రాజకీయ లబ్ధి కోసం కోడెల మృతిని వాడుకుంటూ.... మైలేజ్‌ కోసం చంద్రబాబు తాపత్రాయపడుతున్నారు. కోడెల అంత్యక్రియల్లో చంద్రబాబు తీరు ఎన్నికల ఊరేగింపులా ఉంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ‍్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

దానికి చంద్రబాబే కారణం..
‘కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పే సమయంలో నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. పార్టీ మనిషి చనిపోతే మిగతా నాయకుల్లో బాధ, భావోద్వేగం కనిపిస్తుంది. ఆ బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. కోడెల మరణంతో చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నం చేశారు. గతంలో కోడెల ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుడే చంద్రబాబు పోరాటం చేసి ఉంటే కోడెల బతికేవారు. కోడెలలో చెడు కోణాన్ని చెప్పుకోవాల్సిన దుస్థితి తీసుకు వచ్చింది చంద్రబాబే. ఇక​ కోడెల విషయంలో చంద్రబాబు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నారు. గవర్నర్‌ను కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. 

చదవండిబాబు..ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలుస్తారు

మరి చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తే తప్పేంటి. కోడెల కుటుంబసభ్యుల మీద కేసులు నమోదు చేశారు కానీ విచారణ చేయలేదు. కోడెల తీసుకు వెళ్లింది లక్ష రూపాయల ఫర్నిచర్‌ కాదు...కొత్త అసెంబ్లీలో ఫర్నిచర్‌ కాదు. హైదరాబాద్‌ అసెంబ్లీలో ఉన్న పురాతనమైన ఫర్నిచర్‌ తీసుకువెళ్లారు. కోట్ల రూపాయల విలువ చేసే 114 వస్తువులను కోడెల తీసుకువెళ్లారు. ఈ విషయంలో చంద్రబాబు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు.

పారదర్శకంగా సచివాలయ పరీక్షలు..
లక్షా 27వేల గ్రామ సచివాలయం ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రం ఎక్కడా లీక్‌ అవలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుబట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహింపచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప‍్రశ్నాపత్రం అమ్ముకున్నారంటూ చంద్రబాబు, నారా లోకేష్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారికి ప్రథమ ర్యాంక్‌లు వచ్చాయి. పేపర్‌ లీకయితే అప్పుడే ఎందుకు రాయలేదు.  కావాలనే ఒక పిచ్చి పత్రిక తప్పుడు రాతలు రాస్తోంది. ఆ పిచ్చి పత్రిక రాతలు ఎవరు నమ్మొద్దు’  అని అంబటి సూచించారు.

>
మరిన్ని వార్తలు