ఎవరేమన్నా పట్టించుకోని చంద్రబాబు

22 Apr, 2019 12:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎవరెన్ని చెప్పినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. ‘అంతా నా ఇష్టం’ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నియావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారు. తాజాగా మరోసారి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. ప్రజా కార్యక్రమాలకు ఉపయోగించే ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సోమవారం ఇక్కడ సమావేశం నిర్వహించి మరో వివాదానికి తెర తీశారు. ప్రజా వేదికను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇంతకుముందు సచివాలయంలో కూడా పార్టీ సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు.

చంద్రబాబు వైఖరిని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృ​ష్ణుడు సమర్థించారు. ప్రజా వేదికలో ఎన్నికల సమీక్ష నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎన్నికల సమావేశాలు నిర్వహించుకోవడంలో తప్పులేదని, సీఎం ఎక్కడ ఉంటే అక్కడ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. చంద్రబాబు తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. (చదవండి: ఎన్నికల కోడ్‌ పట్టింపే లేదు)

మరిన్ని వార్తలు