ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

20 Mar, 2018 12:19 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఅర్‌ఎస్‌, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని వైఎస్‌ఆర్‌సీపీ ఆందోళనలు చేపట్టడంతో లోక్‌సభ అట్టుడికిపోయింది. మరోపక్క టీడీపీ ఎంపీలు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లో ఆందోళనలు చేస్తున్నారని, మిగతా పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలబడ్డాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ చంద్రబాబుకు వివరించారు. టీఎంసీ, ఎన్సీపీ, ఆప్‌, ఆర్జేడీ, కమ్యూనిస్టులు, వామపక్షాలు సంఘీభావం తెలిపాయని లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం పేర్కొన్నారు.

కొందరు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు ఎన్నికలు, బీజేపీతోనే వైఎస్‌ జగన్‌ అని.. ఎకనామిక్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌లో వచ్చిన వార్త గురించి ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ మీడియా ఛానళ్లలో చర్చల సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చెప్పామని వారు వివరించారు. టీఆర్‌ఎస్‌, అన్నాడీఎంకే వెల్‌లో గలాటా సృష్టించటంపై చంద్రబాబు స్పందిస్తూ ఏయే పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయో, వారు అలా ఎందుకు చేస్తున్నారో దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ‘అందరినీ సంప్రదించండి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వివరించండి, సహకరించమని అడగండి అని’  చంద్రబాబు ఎంపీలకు సూచించారు. 
 

మరిన్ని వార్తలు