సాక్షి, అమరావతి : మాటలు తూలడంలోనే కాక అసలేం చెబుతున్నారో కూడా అర్థం కాని విధంగా ప్రసంగాలిస్తూ నారా లోకేష్ ఎన్నికల సమరంలో నవ్వులు పూయిస్తూ.. అభాసుపాలవుతున్నారు. ఇక చంద్రబాబు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నోరు జారడంలో కొడుకుతో పోటీపడుతూ చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఏప్రిల్ 9నే ఎన్నికలు అని లోకేశ్ అంటే, 25 అసెంబ్లీ సీట్లు గెలిపించండి చాలు అంటూ నారా బాబు టంగ్ స్లిప్పయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
చంద్రబాబు ఓ సభలో ప్రసంగిస్తూ.. ‘25 అసెంబ్లీ స్థానాలు గెలవాలి.. ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాలి.. నూతన అధ్యాయనాన్ని తిరిగి రాయాలి’ అంటూ మాట్లాడారు. అయితే దీంట్లో చంద్రబాబు ఉద్దేశ్యం ఏంటో గానీ.. ఒకటి మాత్రం స్పష్టం అవుతోంది. తనకు తెలిసో తెలియకో రాబోయే ఫలితాలను బాబు ముందుగానే ఊహించినట్టున్నారు. అవును నిజమే.. టీడీపీ 25 అసెంబ్లీ స్థానాల్ని గెలుస్తుందని.. ఆ దెబ్బతో వైఎస్సార్సీపీ మరో చరిత్రకు శ్రీకారం చుట్టి, నూతన అధ్యాయనాన్ని తిరిగి రాస్తుందనే కామెంట్లతో ఈ వీడియో జోరుగా వైరల్ అవుతోంది. నోరు జారి చంద్రబాబు తన ప్రసంగంలో 25 అసెంబ్లీ స్థానాలు గెలవాలని కోరుకోలేదని.. జరగబోయేదే చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.