నా పిలుపుతోనే కర్ణాటకలో బీజేపీ ఓటమి

1 Aug, 2018 19:04 IST|Sakshi
చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, అనంతపురం : పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలను బెదిరించారని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన పిలుపుకు స్పందించిన కర్ణాటక ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు. దేశంలో అందరి సీఎంల కన్నా నేనే సీనియర్‌ అని, మోదీ కన్నా ముందు నేనే సీఎం అయ్యానని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై మోదీనే యూటర్న్‌ తీసుకున్నారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రాప్‌లో నేను పడలేదని అన్నారు.

కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించకపోతే తామే సొంతగా కట్టుకుంటామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత ఆదాయమంత హైదరాబాద్‌కే వెళ్తోంది. మోదీ అవినీతి ప్రక్షాళన ఏమైంది? ఏటీఎంల్లో డబ్బులు రాకపోవడానికి కారణం మోదీనే. మోదీ నన్ను విమర్శించడం దురదృష్టకరం. టీడీపీ-బీజేపీ మధ్య లేనిపోని గొడవలు వద్దని కొన్ని సందర్భాల్లో కేంద్రాన్ని నిలదీయలేదు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు