‘బోండా కబ్జాల పర్వంపై బాబు స్పందించాలి’

17 Oct, 2018 20:21 IST|Sakshi
సీపీఎం నేత సీహెచ్‌ బాబురావు

సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కబ్జాల పర్వంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని సీపీఎం నేత సీహెచ్‌ బాబురావు డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన భార్యతో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కోర్టులు చివాట్లు పెడితేగాని పోలీసులు కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తక్షణమే బోండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వమే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

గతంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న సాయిశ్రీ! బోండా ఉమామహేశ్వరరావు అనుచరుల వల్లే చనిపోయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు బోండాపై చర్యలు తీసుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. కబ్జాల నాయకుడు బోండా ఉమాపై పోలీసులు వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రెండు రోజులలో బోండా ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోకపోతే, అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీటీడీ బోర్డు మెంబర్ పదవినుంచి బోండాను తొలగించాలన్నారు.

>
మరిన్ని వార్తలు