పునాదులు దాటని పోలవరం
సాక్షి, పోలవరం : పోలవరం... ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దాల కల.. ఆ స్వప్నం సాకారం చేసేందుకు నాడు వైఎస్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాని గత ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో పోలవరం పునాదుల స్థాయి దాటలేదు.ప్రాజెక్టు పనులు నత్తను మరిపిస్తుంటే.. అదిగో పోలవరం.. ఇదిగో పూర్తయిందంటూ.. చెప్పేవన్నీ మోసపూరిత మాటలే..! రేపటి నుంచి పొలాలకు నీళ్లే అంటూ.. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడం మరీ దారుణం.. పోలవరం పేరిట వేలకు వేల కోట్లు దండుకుంటూ.. అసువుగా అబద్ధాలు చెప్పడం నివ్వెరపరుస్తోంది. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకొన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి పోలవరానికి శాపంగా మారింది. ...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు.. నత్తను మరిపిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల సచిత్రాలివిగో..!!
జలాశయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
అప్పుడే బీటలు వారిన డయాఫ్రం వాల్
ఇదిగో పై ఫోటోలు చూశారా.. పోలవరం జలాశయం పనుల్లో భాగంగా 2454 మీటర్ల పొడవుతో, 53.32 మీటర్ల ఎత్తుతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్)ను ఇక్కడే నిర్మించాలి. 194.6 టీఎంసీలు నిల్వ చేసేది ఈసీఆర్ఎఫ్లోనే.. ఈసీఆర్ఎఫ్ నిర్మాణంలో ఇప్పటివరకూ పునాది (డయా ఫ్రమ్ వాల్) పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆ పునాది పనులూ నాసిరకంగానే చేశారు. వర్షాకాలంలో వచ్చిన చిన్నపాటి వరదలకే పునాది గోడలు బీటలు వారి.. కొన్ని చోట్ల శిథిలమయ్యాయి.
ఎగువ కాఫర్ డ్యామ్.. ఎప్పటికి పూర్తయ్యేనో..!
ఈ ఫోటోలో మీరు చూస్తున్నది.. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు... ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి నదిని స్పిల్ మీదుగా మళ్లించడానికి ఎగువన 2454 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్ నిర్మించాలి. దీన్నే 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి, గ్రావిటీ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంలో 72.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకుగాను.. ఇప్పటిదాకా 21.51 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేశారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో.. మిగతా 51.05 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తకావడానికి ఎంతకాలం పడుతుందో అంచనాకు అందడంలేదు.
తాబేలుకు తాత.. ఈ దిగువ కాఫర్ డ్యామ్ పనులు..
ఇదిగో ఈ ఫోటో చూశారా.. దిగువ కాఫర్ డ్యామ్ పనులు.. ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి వీలుగా దిగువ నుంచి గోదావరి వరద జలాలు చేరకుండా దిగువన మరో కాఫర్ డ్యామ్ను 1660 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. ఈ పనుల్లో 26.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకుగానూ.. 4.47 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే చేశారు. మిగతా 22.37 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు తాబేలు నడకను తలపిస్తున్నాయి..
నత్తను మరిపిస్తున్న స్పిల్వే పనులు..
ఈ ఫోటోలో మీరు చూస్తున్నది.. పోలవరం జలాశయం స్పిల్ వే. వరద జలాలను దిగువకు విడుదల చేయడానికి 1054.4 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. స్పిల్వేకు 25.72 మీటర్ల వద్ద(క్రస్ట్ లెవల్) 48 చోట్ల.. 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు అంటే 45.72 మీటర్ల వరకూ(ఎఫ్ఆర్ఎల్) గేట్లు ఏర్పాటు చేయాలి. ఈ స్పిల్ వే పనుల్లో 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకుగానూ.. 26.28 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశారు. మరో 12.60 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. స్పిల్ వేకు 48 గేట్లకుగానూ ఒక చోట మాత్రమే కేవలం స్కిన్ ప్లేట్ను అమర్చారు. ఒక్కో గేటును అమర్చడానికి 30 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు చొప్పున 96 హైడ్రాలిక్ హాయిస్ట్లను అమర్చాలి. వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ నామధేయాన్ని సుస్థిరం చేయాలన్న లక్ష్యంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టును చేపట్టి రూ.5,135.87 కోట్లతో 44.84 శాతం పనులు పూర్తి చేశారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి సన్నద్ధమవుతున్న క్రమంలోనే మహానేత వైఎస్ అమరుడయ్యారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ద్వారా హామీ ఇచ్చింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ.. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తమకు అప్పగించాలని చంద్రబాబు పట్టుబట్టడంతో.. సెప్టెంబరు 7, 2016న పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.
పోలవరం.. నామినేషన్..
పోలవరం హెడ్ వర్క్స్లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది(డయా ఫ్రమ్ వాల్)కే పరిమితమైన దుస్థితి..
భూసేకరణ, పునరావాసంలోనూ దోపిడీ
పోలవరం ప్రాజెక్టుస్పిల్ ఛానల్ నిర్మాణ ప్రాంతం