మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు.