కాంగ్రెస్‌ స్పందించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

26 Oct, 2018 02:16 IST|Sakshi

సామాజికపార్టీపై చిన్నచూపు: చెరుకు 

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మైండ్‌గేమ్‌కు ధీటుగా మహాకూటమిలో వేగం, సమన్వయం ఉండాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు. కొందరే లబ్ధి పొందాలనే వైఖరితో ఉంటే కూటమి దెబ్బతింటుందని హెచ్చరించారు. మహాకూటమి ఆచరణ, ప్రణాళికలు రూపొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులు గోల్కొండ హోటల్‌కు తమను పిలిచారని, ఆ తర్వాత ఉలుకూపలుకూలేదని, తాను ఫోన్లు చేసినా స్పందించడంలేదన్నారు.

సీట్ల సర్దుబాటు విషయంలో సామాజికపార్టీ అయిన ఇంటి పార్టీని చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. కాం గ్రెస్‌ నుండి స్పందన రా కుంటే త్వరలోనే రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతామన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉద్యమకా రులు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ కలసి మహాకూటమిగా ఏర్పడాలని మొదట ప్రతిపాదించింది తెలంగాణ ఇంటి పార్టీ అని గుర్తుచేశారు. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీ దగ్గరైందని, కూటమి కావాలన్న ఇంటిపార్టీ దూరమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు