అభివృద్ధిలో భేష్ అంటూ ప్రశంసలు
ఇబ్రహీంపూర్ను సందర్శించిన ఛత్తీస్గఢ్ సర్పంచ్లు
సాక్షి, మెదక్: జాతీయస్థాయిలో గుర్తింపు సాధించి.. పలు అవార్డులు ఇబ్రహీంపూర్ మరోసారి సందర్శకులతో కిటకిటలాడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు దత్తత తీసుకున్న ఈ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఎన్ఐఆర్డీలో శిక్షణ కోసం వచ్చిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 45 మంది సర్పంచ్ల బృందం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించింది.
గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, వివిధ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ఇబ్రహీంపూర్లో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే హరీశ్రావు చూపించిన స్ఫూర్తి ఆదర్శమని వారు ప్రశసించారు. ఇక్కడి అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. గ్రామాభివృద్ధి విషయంలో ఇబ్రహీంపూర్ ఒక అధ్యయన కేంద్రమని, ఇక్కడ నుంచి పాఠాలు నేర్చుకున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజల ఐక్యత చూస్తే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి దేవయ్య, ఎంపీడీవో సమ్మిరెడ్డి, కార్యదర్శి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.