ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌

20 Nov, 2018 08:27 IST|Sakshi

రాయపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ పోలింగ్‌ కొనసాగుతుంది. 19 జిల్లాలోని 72 నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి తొలి దశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసీ మొత్తం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రమణ్‌సింగ్‌ ప్రభుత్వంలోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ భూపేశ్‌ బఘేల్, అజిత్‌ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్‌ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్‌ జోగికి చెందిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. కాగా, 72 స్థానాల్లో 1,079 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు