అయ్యన్న పాత్రుడి బూతు పురాణం 

25 Sep, 2019 08:04 IST|Sakshi

అసభ్య పదజాలంతో ప్రభుత్వంపై దూషణలు  

సాక్షి, విశాఖ :  టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్‌ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాష ఉపయోగించారు. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. పెన్షన్‌ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, పాత కేసులు బయటికి తీస్తున్నారని ఆరోపించారు. 

కేసులకు ఎవరూ భయపడబోరని అన్నారు. పనికిమాలిన పల్నాడు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కోడెల శివప్రసాదరావుపై వేధించి కేసు పెట్టించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మంత్రి బొత్స నీతిమంతుడు, పతివ్రతలాగా మాట్లాడుతున్నాడని, వోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ వెళ్లిపోవడానికి ఆయనే కారణమని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.    

మరిన్ని వార్తలు