పోరాట వీరుడి అరెస్టు బాధాకరం

27 Dec, 2017 01:47 IST|Sakshi

మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య

హైదరాబాద్‌: ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఒక పోరాట వీరుడిని అరెస్టు చేయడం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంద కృష్ణ మాదిగ అరెస్టు రాజకీయ సమస్య కాదని, సామాజిక సమస్యని అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ మేధావుల వేదిక, మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ రాజకీయ విభేదాలున్నప్పటికీ ఒక పోరాట యో«ధుడిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితులపై కక్ష కట్టిందని సామాజిక వేత్త ఉ.సాంబశివరావు విమర్శించారు. మనువాదులు, బహుళజాతి కంపెనీలు, భూస్వాముల ప్రయోజనాల కోసమే పాలక వర్గాలు పని చేస్తున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ విమర్శించారు. కార్యక్రమంలో ఐఆర్‌ఎస్‌ అధికారి భరత్‌ భూషణ్, ప్రొఫెసర్‌ ఖాసీం, ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, కామల్ల ఐలయ్య, విమలక్క, విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు