వైఎస్సార్‌సీపీ నేతలపై బదిలీ అయిన సీఐ దాడి

16 Apr, 2019 13:10 IST|Sakshi

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి బరితెగించారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. దీంతో నారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపుకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఖాదర్‌, హుస్సేన్‌, రఘులపై లాఠీలతో తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌లో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు. జేసీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బదిలీ అయిన సీఐ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఈ విధంగా దాడి చేయడంపై పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జేసీ బ్రదర్స్‌ అండతో నారాయణరెడ్డి రెచ్చిపోతున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి తప్పుబట్టారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే అధికారం నారాయణరెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. బదిలీ అయిన సీఐకి తాడిపత్రిలో ఏం పని అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ సీఐని సస్పెండ్‌ చేసి.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు