సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని దారుస్సలాంలో తలుపులేసుకుని మీటింగ్లు పెట్టుకోవడం కాదని, బయటికొచ్చి బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎంఐఎం నేతలకు సవాల్ చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఈ నెల 28న తాము నిర్వహించబోయే నిరసన ర్యాలీకి మద్దతిచ్చి.. ర్యాలీలో పాల్గొంటారా? అని ఎంఐఎం నేతలను ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ లోని మీడియా హాల్లో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ..
ఎంఐఎం లాంటి పార్టీల కారణంగానే బీజేపీ విభజన, మతతత్వ విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనార్టీల ఆందోళనకు ఆ పార్టీ వ్యవహారశైలే కారణమని విమర్శించారు. పౌరసత్వ చట్ట సవరణను దేశం లోని అన్ని రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకుంటున్నారని భట్టి ప్రశ్నించా రు. ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించే ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.